ఏపీ సర్కారుకు షాక్
ఇసుక. ఏపీలో అధికార పార్టీ నేతలకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టిన ఖనిజం. గతంలో ఎన్నడూలేని రీతిలో ఇసుక పార్టీ నేతలకు ఓ అతి పెద్ద ఆదాయ వనరుగా మారింది. అది వందల కోట్ల రూపాయల్లో ఉంది అంటే సహజ వనరు ఎలా దోపిడీకి గురైందో ఊహించుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఓ ఎన్నికల అంశంగా కూడా మారింది. ఈ తరుణంలోనే ఏపీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది వద్ద ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100కోట్లు జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ నిర్ణయం వెలువరించింది.
అక్రమంగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. నిబంధనల ప్రకారం పది టైర్ల లారీకి 21 టన్నులు లోడ్ చేయాల్సి ఉండగా, 30 నుంచి 40 టన్నులు లోడ్ చేస్తూ పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు.