పెరిగిన మోడీ ఆస్తులు

ఆయన ప్రధాన ఆదాయ వనరు వేతనం. అంతే కాదు..బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీనే. శుక్రవారం నాడు వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్రమోడీ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. అయితే గత ఎన్నికల సమయంతో పోలిస్తే ప్రస్తుతం మోడీ ఆస్తులు పెరిగాయి. 2014తో పోలిస్తే 2019 లో మోడీ ఆస్తులు 52 శాతం మేర పెరిగాయి. మోడీ అఫిడవిట్ ప్రకారం చరాస్తుల్లో అధిక భాగం ఎస్బీఐలోని రూ 1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అఫిడవిట్లో తన ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా ప్రధాని వెల్లడించారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులను రూ 1.10 కోట్లుగా చూపారు.
మోదీ చరాస్తులు 2014తో పోలిస్తే 114 శాతం పెరిగాయి. 2014లో ఆయన తన చరాస్తుల విలువ రూ 65.91 లక్షలుగా చూపారు. తనపై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని, అప్పులు కూడా లేవని అఫిడవిల్లో పేర్కొన్నారు.చరాస్తుల్లో రూ 38,750 చేతిలో నగదు కాగా, బ్యాంకులో కేవలం రూ 4,143 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపారు. ఎస్బీఐలో రూ 1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు.