Telugu Gateway
Politics

బిజెపిలో ‘అద్వానీ వ్యాఖ్యల కలకలం’

బిజెపిలో ‘అద్వానీ వ్యాఖ్యల కలకలం’
X

ఎన్నికల ముందు బిజెపికి షాక్. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎల్ కె అద్వానీ చేసిన వ్యాఖ్యలు బిజెపిని ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. గత కొంత కాలంగా బిజెపికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు..ఆ పార్టీ సీనియర్ నేతలు ఎవరు కేంద్ర ప్రభుత్వాన్ని..బిజెపి నేతలను విమర్శించినా వారందరినీ ‘జాతి వ్యతిరేకులు’గా అభివర్ణిస్తున్నారు. దీంతో పాటు రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు ప్రధాని మోడీ అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో అద్వానీ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగ మారాయి. ఏప్రిల్ 6న జరిగే పార్టీ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన ‘మొదట దేశం– ఆ తర్వాత పార్టీ–చివరిలోనే వ్యక్తిగతం’ శీర్షికన సుమారు 500 పదాలతో తన బ్లాగ్‌లో తన భావాలను పంచుకున్నారు. ‘బీజేపీలో ఉన్న మనమంతా గతం, భవిష్యత్తుపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కీలక సందర్భమిది. 1991 నుంచి ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. రాజకీయంగా విభేదించిన వారిని బీజేపీ ఎన్నడూ కూడా శత్రువుగా చూడకుండా ప్రత్యర్ధిగా మాత్రమే భావించింది. పార్టీ స్థాపించిన మొదటి నుంచీ ఇదే వైఖరి అవలంబించింది. ఏకీభవించని రాజకీయ విరోధులను జాతి వ్యతిరేకులుగా చూడరాదన్నది పార్టీ జాతీయవాద భావన’ అని పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ప్రతి పౌరుడూ తనకు ఇష్టానుసారం వ్యవహరించే హక్కు ఉందన్న సిద్ధాంతానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. ‘పార్టీ లోపల, జాతీయ స్థాయి నిర్మాణంలోనూ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణ బీజేపీ గర్వించదగిన లక్షణాల్లో ఒకటి. అందుకే స్వాతంత్య్రం, సమగ్రత, నిజాయతీ, అన్ని రాజ్యాంగ సంస్థల పరిరక్షణలో బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండగవంటివి. మన ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన రాజకీయ పార్టీలు, మీడియా, ఎన్నికల అధికార యంత్రాంగం.. అన్నిటికంటే ముఖ్యంగా ఓటర్లు ఈ సందర్భంగా నిజాయతీతో కూడిన ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని అన్నారు. సీనియర్‌ నేత ఎల్‌కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ సిద్ధాంతాల సారాన్ని ఆయన చాలా స్పష్టంగా వివరించారని చెప్పారు. ‘బీజేపీ వైఖరిని అడ్వాణీజీ చాలా స్పష్టంగా విశదీకరించారు. ‘మొదట దేశం, తర్వాత పార్టీ, అంతిమం వ్యక్తిగతం’ అంటూ అందరికీ ఆదర్శవంతమైన నినాదమిచ్చారన్నారు.

Next Story
Share it