హార్దిక్ పటేల్ కు షాక్

ఊహించని పరిణామం. కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ఓ బహిరంగ సభలో సీరియస్ గా మాట్లాడుతుండగా..సడన్ గా ఓ వ్యక్తి వేదిక ఎక్కి చెంపపై గట్టిగా కొట్టారు. ఈ హఠాత్ పరిణామంతో షాక్ కు గురైన హార్ధిక్ పటేల్ వెంటనే తేరుకుని ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామం అక్కడ ఉన్న వారందరినీ షాక్ కు గురిచేసింది. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేందర్ నగర్ జిల్లా నిర్వహించిన జన ఆక్రోష్ సభలో ఆయన పాల్గొన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
హార్ధిక్ పటేల్ పై దాడి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. మార్చిలో కాంగ్రెస్లో చేరిన హార్దిక్.. జామ్నగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. కానీ 2015లో పటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన దాడి వెనుక హార్దిక్ ప్రోద్బలం ఉందంటూ మెహ్సనా జిల్లా పోలీసులు కేసులువేశారు. 2018లో విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హార్దిక్ ఆశలు అడియాశలయ్యాయి. అయినా కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.