జగిత్యాలలో ఈవీఎంల కలకలం
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవీఎంల రచ్చే. తాజాగా తెలంగాణలోని జగిత్యాలలో కూడా ఈవీఎంల కలకలం మొదలైంది. సోమవారం రాత్రి ఆటోలో కొన్ని ఈవీఎంలను తరలించిన వ్యవహారం ఇఫ్పుడు పెద్ద దుమారం రేపుతోంది. అసలు ఇలా ఈవీఎంలు బయట ఎందుకు ఉన్నాయి?. వాటిని ఆటోలో ఎందుకు తీసుకెళుతున్నారు అన్న కోణంలో విచారణ మొదలైంది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకువచ్చారు.
ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో అధికారులు ఎవరూ వాటితో లేకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈవీఎంలను ఆటోలో తరలించడం గమనించిన కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. అదే సమయంలో ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవి డెమో ఈవీఎంలు అని ఆటో డ్రైవర్తో పాటు అక్కడున్న మరో వ్యక్తి చెబుతున్నారు. మరి ఈ అంశంపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.