టీఆర్ఎస్ లో చేరిన ‘గండ్ర’

లేదు..లేదంటూనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయన సోమవారం నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో సమావేశం అయ్యారు. కుటుంబ సమేతంగా ఆయన ఈ టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లు అయింది. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఈ చేరికకు ప్రతిఫలంగా గండ్ర జ్యోతిని వరంగల్ గ్రామీణ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా టీఆర్ఎస్ ఖరారు చేసింది. పార్టీ మారుతున్నట్లు గండ్ర వెంకటరమణారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నా. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయనకు రెండోసారి అధికారం ఇచ్చారు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ప్రజాప్రతినిధిగా నా విధి. భూపాలపల్లి జిల్లా, నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటా. ఎన్నికల సందర్భంగా ఔటర్ రింగ్రోడ్డు, మెడికల్ కాలేజీ సాధిస్తానని చెప్పా. నా మాటకు కట్టుబడి ఉన్నా. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయ్యేలా చూడటం నా బాధ్యత. కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో వాటిని పూర్తి చేస్తా. టీఆర్ఎస్పై, ముఖ్యమంత్రి కేసీఆర్పై నాకు అచంచల నమ్మకం ఉంది. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా తీర్చిద్దీదుతున్న ఆయనతో కలసి నడవాలని నిర్ణయించుకున్నా. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధమే. అతిత్వరలోనే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నా’ అని లేఖలో గండ్ర పేర్కొన్నారు.