సీఎం రమేష్ మేనల్లుడి ఆత్మహత్య

తెలంగాణాలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వరస పెట్టి చోటుచేసుకుంటున్న ఈ సంఘటన విద్యార్ధుల తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్ధులు ఫెయిల్ అయ్యామనే కారణంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఆ ఘటన జరిగినా..ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్ మెంట్ ఏడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశాడు.
తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ధర్మారామ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు తమ బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. 50వేల మంది విద్యార్థులు ఒక్క లెక్కల పరీక్షలోనే ఎందుకు ఫెయిల్ అవుతారని ప్రశ్నిస్తున్నారు.