Telugu Gateway
Politics

చంద్రబాబు సమీక్ష ఇచ్చిన క్లారిటీ..టీడీపీ ఇంటికేనా?!

చంద్రబాబు సమీక్ష ఇచ్చిన క్లారిటీ..టీడీపీ ఇంటికేనా?!
X

టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమీక్ష క్లారిటీ ఇచ్చేసిందా?. అంటే ఔననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ నెల 22న చంద్రబాబు అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్ధులతో సమావేశం అయి ‘రాజకీయ సమీక్ష’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘జనసేన 30 నుంచి 35 నియోజకవర్గాల్లో దెబ్బకొట్టింది. మరో 20 నుంచి 25 చోట్ల పోల్ స్ట్రాటజీలో ఫెయిల్ అయ్యాం. కొన్ని చోట్ల అనుకున్న విధంగా అందజేయలేకపోయాం’ అని పార్టీ అధినేత వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం పోటీ చేసిన అభ్యర్ధుల వంతు అయింది. ఈ లెక్కల్లో జనసేన ప్రభావం చూపించిన నియోకవర్గాల్లో కనిష్టంగా 30 అసెంబ్లీలు, పోల్ స్ట్రాటజీలో ఫెయిల్ అయిన మరో 20 నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే ఈ లెక్కే 50 అసెంబ్లీ సీట్లు అవుతుంది. మరి స్ట్రెయిట్ గా 50 సీట్లు గల్లంతు అయ్యాక మిగిలిన 125 సీట్లలో అధికారానికి అవసరమైన సీట్లు టీడీపీ దక్కించుకోగలదా? అంటే అనుమానమే అని చెబుతున్నారు టీడీపీ నేతలు.

గత ఎన్నికల్లో అతి తక్కువ తేడాతోనే టీడీపీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఒంటరిగా ఎన్నికల బరిలో నివటం కూడా కూడా ఇదే తొలిసారి. దీనికి తోడు చంద్రబాబు సర్కారుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు..ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, పథకాల అమల్లో వైఫల్యాలు వంటి ఎన్నో ప్రతికూలతు ఉన్నాయి. మరి ఇన్ని ప్రతికూల అంశాలను అధిగమించి టీడీపీ మరోసారి అధికారం దక్కించుకోగలదా? అంటే ఖచ్చితంగా డౌటే అని చెప్పకతప్పదంటున్నారు ఆ పార్టీ నాయకులే.

ఇదిలా ఉంటే విశాఖపట్నానికి చెందిన ఓ మంత్రి జిల్లా వారీ సమీక్ష సమయంలో ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి సార్ అని పదే పదే చంద్రబాబును ప్రశ్నించగా.. అవన్నీ నీకెందుకయ్యా...ఓ 25 మంది వైసీపీ అభ్యర్ధులతో టచ్ లో ఉండండి..ఎప్పుడు ఏమీ చేయాలో నేను చెబుతా అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఓ వైపు జనసేన వల్ల..మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్ మెంట్ ఫెయిల్ అయ్యామని చెబుతూనే....తిరిగి తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు చెప్పటంతో అవాక్కు అవటం టీడీపీ నేతల వంతు అయింది. సమీక్షా సమావేశం వరకూ తమకు కొన్ని సందేహాలు ఉండేవని.. ఈ సమీక్ష తర్వాత పూర్తి క్లారిటీ వచ్చేసిందని కొంత మంది టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it