తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

ఆరోపణలు..ప్రత్యారోపణలు. దొంగ మీరు అంటే..మీరే దొంగ అంటూ పరస్పరం విమర్శలు. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోపణల పర్వం ఇది. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. డేటా చోరీకి సంబంధించి తెలంగాణ సర్కారు దూకుడు చూస్తుంటే ఈ కేసును అంత తేలిగ్గా వదిలిపెట్టేలా కన్పించటంలేదని స్పష్టం అవుతోంది. అయితే ఈ పరిణామాలు ఎక్కడి వరకూ వెళతాయనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. మరో నెల రోజుల్లో లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన డేటా చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం కెసీఆర్ సర్కారు ప్రత్యేక సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. సిట్ ఇంచార్జిగా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు. సిట్ బృందంలో సైబర్ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు చోటు కల్పించారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్కు బదిలీ చేయనున్నారు. డీజీపీ కార్యాలయంలోనే సిట్కు సంబంధించి ప్రత్యేక చాంబర్ను కేటాయించనున్నారు.