లోటస్ పాండ్ లో ఎమ్మెల్యేకు ‘నో ఎంట్రీ’
ఆయనో సిట్టింగ్ ఎమ్మెల్యే. పార్టీ అధినేతను కలవటానికి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోయినా కూడా కనీసం లోపలికి పిలిచి అయినా మాట్లాడతాలి. పరిస్థితిని వివరించాలి. కానీ చిత్తూరు జిల్లాకు చెందిన పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన లోటస్ పాండ్ లోకి ప్రవేశించటానికి సిబ్బంది అనుమతించలేదు. ఆయనకు సీటు దక్కకపోవచ్చని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. లోటస్ పాండ్ వద్ద మంగళవారం రెండు గంటలు పాటు వేచిచూశారు.
భార్యతో కలసి మరీ ఆయన అక్కడకు వచ్చారు. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వీరిని చూసినా కూడా లోపలికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయలేదు. అయితే జగన్ బిజీగా ఉన్నందునే వీరిని కలవలేదని..తర్వాత సమాచారం ఇస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గేట్ వద్ద ఓ ఎమ్మెల్యేను కుటుంబంతో సహా నిలబెట్టడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.