తెలుగుదేశానికి నామా రాజీనామా
తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశానికి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరర్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. తన పదవులు అన్నింటికి రాజీనామా చేశారు. టీడీపీ తరపున ఖమ్మం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం ఆయన కాంగ్రెస్ వైపు కూడా చూశారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరటానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే కెసీఆర్, కెటీఆర్ లతో ఆయన చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. టీడీపీలో ఉండగానే నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య విభేదాలు ఉండేవి. ఇప్పుడు తుమ్మల ఉన్న పార్టీలోకే నామా నాగేశ్వరరావు కూడా చేరుతున్నారు. మరి టీఆర్ఎస్ ఎంపీ సీటు ఆయనకు కేటాయిస్తే తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. ఓ వైపు టిక్కెట్ దక్కకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉండటం సహజం. దీనికితోడు తుమ్మలకు..నామాకు మొదటి నుంచి లేని సఖ్యత. ఇన్ని వైరుధ్యాల మధ్య రాజకీయాలు ఎలా ముందుకెళతాయో వేచిచూడాల్సిందే.