జగన్ ను కాపాడటంలో మోడీతో పాటు చంద్రబాబూ పాత్రదారుడే!
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోమరింత లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఈడీ డైరక్టర్ కర్నల్ సింగ్ సీబీఐకి లేఖ రాసింది ఎప్పుడు?.2017 మే 30న. అప్పుడు కేంద్రంలోని మోడీ కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ లేఖపై మోడీ సర్కారు స్పందించలేదంటే అందులో ఖచ్చితంగా మోడీతో పాటు టీడీపీ మంత్రుల పాత్ర కూడా ఉంటుంది కదా?. టీడీపీ మంత్రులు భాగస్వాములుగా ఉన్న రోజుల్లోనే ఇది జరిగింది కదా?. మరి ఇందులో చంద్రబాబు పాత్ర లేదా?. మోడీది ఎంత తప్పు ఉందో..ఈ కేసులో ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్న టీడీపీది కూడా తప్పే కదా?. ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఈడీ డైరక్టర్ లేఖ రాస్తే కేంద్రంలో మంత్రులను పెట్టుకుని టీడీపీకి ఈ విషయం ఇప్పటివరకూ తెలియదా?. తెలిసినా కేవలం ఎన్నికల సమయంలో వాడుకుందామనే ఉద్దేశంతో దీన్ని పక్కన పెట్టారా?. ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయటం వెనక అంతర్యం ప్రజలు గమనించలేరా?. ఈ అంశాలు అన్నింటిని వదిలేసి ఇప్పుడు చంద్రబాబు కేవలం మోడీ ఒక్కరే తప్పు చేశారు..తానొక్కడినే అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తే ఎవరైనా నమ్ముతారా?. బుధవారం నాడు విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రెండు గంటల పాటు ఇదే అంశంపై స్పందించారు. ఆయన విమర్శల్లోని ముఖ్యాంశాలు.
మోడీ-జగన్-కెసిఆర్-ఈడీ లింకులు. ఈడి డైరెక్టర్ కర్నల్ సింగ్ సిబిఐ రాసిన లేఖ బయట పడింది. ఇదొక మెగా కుట్ర. మెగా నెక్సస్. ఏవిధంగా జగన్ ను బానిసగా చేసుకున్నారో ఉదాహరణ. అలాంటి మాస్టర్ క్రిమినల్ మళ్లీ మనకు దొరకడనే కాబోలు నరేంద్ర మోది, కెసిఆర్ అతడికి అండగా ఉండటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. 3 పార్టీల లాలూచి కుట్రలు 2ఏళ్లుగా ఏవిధంగా జరిగాయో మరో ఉదాహరణే ఈడి డైరెక్టర్ కల్నల్ సింగ్ లేఖ. 30.05. 2017లోనే జగన్ అక్రమాలను ఈడి నిర్ధారించినా మోడీ ప్రభుత్వం తొక్కిపట్టింది. ఆ స్కామ్ మొత్తాన్ని కర్నల్ సింగ్ లేఖ బైటపెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హిందూజా గ్రూపునకు 100 ఎకరాలు ఇచ్చినందుకు ప్రతిగా జగన్ కు 11 ఎకరాలు-ఆ 11 ఎకరాలు కొనేందుకు కూడా( రూ.40కోట్లు) సదరు హిందుజానే చెల్లించడం-’ఈ మొత్తం కుంభకోణం ఏ 1, ఏ 2 దగ్గరుండి నడిపించడం. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకి 2017 మే 30న రాసిన లేఖతో మోది-జగన్-కెసిఆర్ లాలూచి వెల్లడి. ఈ అక్రమ భూ కేటాయింపులను తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయకపోవడం ‘‘టిఆర్ ఎస్-వైసిపి లాలూచి’’కి నిదర్శనం.అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు.