Telugu Gateway
Politics

చంద్రబాబుకు నిద్ర లేకుండా చేశా

చంద్రబాబుకు నిద్ర లేకుండా చేశా
X

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రధాని నరేంద్రమోడీ వ్యంగాస్త్రాలు సంధించారు. మాట్లాడితే చంద్రబాబు తాను మోడీ కంటే సీనియర్ నని..తన కంటే సీనియర్ ఎవరున్నారంటూ ప్రశ్నిస్తారు. ఈ అంశాన్ని గుర్తుచేస్తూ గుంటూరులో బిజెపి నిర్వహించిన సభలో విమర్శలు సంధించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ ను కూడా వదల్లేదు. ఏపీకి నూతన రాజధాని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు..కూలిపోతున్న పార్టీని నిర్మించుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. ‘సన్ రైజ్ స్టేట్’ అని ప్రచారం చేసుకుంటూ కొడుకు లోకేష్ సంపద పెంచే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. పార్టీలు మారడంలో, కూటమిలు మార్చడంలో సీనియర్ అని మోడీ ఎద్దేవా చేశారు. మామకు వెన్నుపోటు పొడిచి అదికారం సాదించడంలో సీనియర్, ఎన్నికల తర్వాత ఓడిపోవడం మీరు సీనియర్..నేను ఆ విషయంలో పోటీలోకి రాలేను..మీరు సీనియర్ ..ఎవరిని తిడతారో,ఆ తర్వాత వారి ఒడిలో కూర్చోవడంలో సీనియర్..ఆంద్రప్రజల కలలను నిర్వీర్యం చేయడంలో సీనియర్ అని మోడీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే ...మరోసారి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదని అన్నారు. మహాకూటమి అపవిత్ర కలయిక అన్న ఆయన.. తన రాజకీయ స్వార్థం కోసమే చంద్రబాబు మహా కూటమితో పొత్తు పెట్టుకున్నారన్నారు. మహా కల్తీ కూటమిలో చంద్రబాబు చేరారని, ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటారని మోదీ నిలదీశారు. మీతో మాట్లాడుతున్న ఈ చౌకీదార్ చంద్రబాబుకు నిద్ర లేకుండా చేశారు. ఈ నాలుగు వాస్తవాలతో ఆయన పూర్తిగా భయపడుతున్నారు. రోజు చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన ప్రతి పైసా లెక్క అడుగుతున్నాం. దీంతో చంద్రబాబు వణికిపోతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి తాము లెక్కలు అడిగే సరికి చెప్పలేక ఆయన భయపడుతున్నారు. గతంలో చంద్రబాబు ఎవరికీ లెక్కలు చెప్పేవారు కాదు. ఏపీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాం. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులనే ఏపీకి కేటాయించాం. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఏపీకి సుమారు రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాం. నాకు ఆస్తులు పెంచుకోవడం తెలియదని చంద్రబాబు అన్నారు. అది నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకూ తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు.

కేవలం దేశ సంపదను పెంచడం కోసమే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. దేశ సంపదను పెంచేందుకు మహిళలు, యువకులు ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాల్ని వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే అతడు ప్రజల మద్దతు కోల్పోయాడని అర్థం. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్థం. కేంద్రం గత 55 నెలల్లో ఏపీకి నిధులు ఇవ్వడంలో లోటు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదు. ఏపీని విభజించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్ తన స్వలాభం కోసమే విభజన చేసింది. అలాంటి ఆ పార్టీతో చంద్రబాబు జత కట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాతో ఎంత లాభం కలుగుతుందో ...ప్రత్యేక ప్యాకేజీ కింద అన్ని నిధులు వచ్చేలా చేశాం. ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు. 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. చంద్రబాబు కేంద్రాన్ని మెచ్చకుంటూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారని’ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Next Story
Share it