Telugu Gateway
Politics

అవినీతిలో మునిగినందుకే ఏపీలో సీబీఐని అడ్డుకున్నారు

అవినీతిలో మునిగినందుకే ఏపీలో సీబీఐని అడ్డుకున్నారు
X

ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు అవినీతిలో కూరుకుపోయినందునే సీబీఐని అడ్డుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారని..గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో తనకు ఎలాంటి భయం లేనందునే సీబీఐని అడ్డుకోవటం వంటి పనులు చేయకుండా విచారణ ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో సీబీఐని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏపీతో పాటు బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీబీఐని నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని మోడీ తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తాను గుజరాత్‌ సీఎంగా ఉన్నానని, ఆ సమయంలో కాంగ్రెస్‌ అధికారాన్ని దుర్వినియోగపరిచి తనపై సీబీఐ విచారణ చేపట్టారని మోదీ పేర్కొన్నారు. సీఎం పదవిలోఉన్న తాను ఏ తప్ప చేయనందుకే చట్టాన్ని గౌరవించి విచారణను ధ్యైరంగా ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తుచేశారు.

ఢిల్లీలో జరుగుతున్న బిజెపి జాతీయ కౌన్సిల్‌ రెండోరోజు సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయీ మరణాంతరం జరుపుకుంటున్న మొదటి కౌన్సిల్‌ సమావేశాలని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలన కారణంగా (2004-14) పదేళ్లు దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందనీ, విలువైన సమయాన్ని కాంగ్రెస్‌ పాలకులు వృథా చేశారని మండిపడ్డారు. ఆ పదేళ్లు దేశమంతా అవినీతి స్కాంలు, కుంభకోణాల్లో మినిగితేలిందని ఆరోపించారు. ఆగస్టా వెస్ట్‌ లాండ్‌ కుంభకోణంలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నందునే విచారణను కప్పిపుచ్చారనీ, ప్రజల సొమ్ముకు తిన్న ఏఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టదని మోదీ హెచ్చరించారు. హిందూవుల డిమాండైన అయోధ్య రామ మందిరాన్ని కోర్టుల్లో కాంగ్రెస్‌కు చెందిన న్యాయవాదులు ఏవిధంగా అడ్డుకుంటున్నారో మనందరికీ తెలుసన్నారు. ఎన్నోఏళ్లు ప్రకటనలకే పరిమితమైన అగ్రవర్ణల రిజర్వేషన్లను తమ ప్రభుత్వం చేసి చూపిందని మోదీ పేర్కొన్నారు.

Next Story
Share it