ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు

అనుకున్నదే జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు పడింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేస్తూ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిలను అనర్హలుగా ప్రకటించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు మండలి ఛైర్మన్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్లో చేరినందుకు వారి సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేసింది.
అనర్హతకు గురైన యాదవ్ రెడ్డి ఎమ్యెల్యేల కోటాలో మండలికి ఎన్నికైయ్యారు. మరోసభ్యుడు భూపతిరెడ్డి నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికైయ్యారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్ కూడా అనర్హతకు గురైయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ప్రకారం సభ్యులపై చర్యలు తీసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కొండా మురళి ఇదివరకే మండలి సభ్యుత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.