స్టాక్ మార్కెట్లో కలకలం
పార్లమెంట్ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడటంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. సోమవారం నాడు భారీ ఎత్తున పతనం అయ్యాయి. మంగళవారం నాడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల నష్టంతో 35,119 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 10,537 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠతో పాటు రూపాయి క్షీణత, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా-చైనాల మధ్య వర్తక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.
రిలయన్స్ ఇండస్ర్టీస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, కొటాక్ బ్యాంక్, వేదాంత, యస్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ సహా పలు షేర్లు నష్టాల బాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతుండగా, దేశీయ సంస్ధాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ ఇలా భారీగా పడిపోయిన సమయంలోనే లిక్విడిటి ఉన్న వారు షేర్లను కొనుగోలు చేయటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.