వాజ్ పేయి బొమ్మతో వంద నాణెం

దేశ కరెన్సీ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు కొత్త రికార్డులు సృష్టించనుంది. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారన్న సంగతి పక్కన పెడితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం దేశంలో కరెన్నీ మొత్తాన్ని మార్చేసింది. పాత వెయ్యి రూపాయలు..ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసి..కొత్తగా రెండు వేల రూపాయలతోపాటు ఐదు వందల రూపాయల నోటును తెచ్చిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా అన్ని కొత్త నోట్లను తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి బొమ్మతో వంద రూపాయల నాణేన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ నాణెం విడుదల చేశారు. వాజ్పేయి జయంతోత్సవానికి ఒక రోజు ముందు ఈ నాణేలను ప్రభుత్వం విడుదల చేయడం విశేషం.
వాజ్పేయి జయంతిని బీజేపీ సుపరిపాలన దినంగా వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాజ్పేయి ఫోటోతో కూడిన రూ వంద నాణేల విడుదల కార్యక్రమంలో ప్రధానితో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.వాజ్పేయి ఈ ఏడాది ఆగస్ట్ 16న ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వాజ్పేయి 1998-2004లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.