‘అమ్మాయిలకు ప్రత్యేకం’ అంటున్న నాని
నాని కొత్త సినిమా ఖరారైంది వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా అమ్మాయిలకు ప్రత్యేకం అంటున్నారు హీరో నాని. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నాని..విక్రమ్ కుమార్ తోపాటు ఇందులో ముఖ్యమైన ఐదుగురు ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు? అంటే వచ్చే ఏడాది చెబుతాం అంటోంది చిత్రబృందం. ‘విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ విషయంపై ఆదివారం అధికారిక ప్రకటన విడుదలైంది.
‘నేను, విక్రమ్.. ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరంలో..! అమ్మాయిలూ... ఇది మీ కోసమే’ అని నాని పేర్కొన్నారు. ‘నాని, నేను ఓ విభిన్నమైన కథాంశంతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ చిత్రం అమ్మాయిలకు ప్రత్యేకమైనదిగా ఉంటుంది’ అన్నారు దర్శకుడు విక్రమ్. ‘నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మా సంస్థలో సినిమా నిర్మించనుండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పీసీ శ్రీరామ్గారు ఛాయాగ్రాహకులుగా పనిచేస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఫిబ్రవరి 19 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘నా డ్రీమ్ టీమ్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు పీసీ శ్రీరామ్.