చావనైనా చస్తా...తెలంగాణను బానిస కానివ్వను
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చావనైనా చస్తాను కానీ..తెలంగాణను బానిస కానివ్వను అంటూ వ్యాఖ్యానించారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను గద్దలు..కాకుల పాలు కానివ్వవద్దు. ఎవరూ బిస్కట్ లా రాష్ట్రాన్ని ఇవ్వలేదు..దీని కోసం ఎంత కొట్లాడామో అందరికీ తెలుసు. కోదాడ సభలో చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడతాడు. ఆయనకు కెసీఆర్ తప్ప ఎవరు ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఆయనకు కీలుబొమ్మ వ్యక్తులు కావాలి. తెలంగాణ చేజారిపోయిందన్న బాధ చంద్రబాబుకు ఉందన్నారు.అంతే కాదు.. క్రిష్ణాలో నీలు లేవు అని చెబుతాడా?. చంద్రబాబు ఆ మాటలు చెపితే దద్దమ్మ కాంగ్రెస్ వాళ్లు ఊ కొడతారా?. ఎన్ని మోసాలు చేస్తారో వీళ్లు. జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతాం..నష్టపోతాం. మీరు చేయాల్సింది కేవలం ఓటుతో కొట్టాలి. అది చాలు. ఒక్క కెసీఆర్ ను కొట్టడం చేతకాక కాంగ్రెస్ పార్టీ భుజాలపై ఎత్తుకుని చంద్రబాబును తీసుకొచ్చింది. మనం కొట్టిన దెబ్బకు కరకట్టకు పోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకు వస్తున్నారు. కెసీఆర్ బతికున్నంత వరకూ రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.
దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అధికారం పోయిందన్న కసి..దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అని ధ్వజమెత్తారు. ప్రతి ఏటా తెలంగాణ ఆదాయం దూసుకెళుతోంది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి మోడీ, చంద్రబాబులు కలసి ఎన్నో సమస్యలు కల్పించారని అన్నారు. వేల కోట్ల రూపాయలతో ఆంధ్రా నాయకులను తెచ్చుకుని తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మేధావులతో పాటు అన్ని వర్గాల వారు తెలంగాణకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళుతుందని చెప్పారు. కోటి ఎకరాల తెలంగాణ..ఆకు పచ్చ తెలంగాణనే తన ధ్యేయం అని అన్నారు. దేశం నివ్వెరపోయేలా పాలన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఎరువులు..విత్తనాల కొరత ఏమీలేదన్నారు.