Telugu Gateway
Telangana

నాయినికి హ్యాండిచ్చిన కెసీఆర్

నాయినికి హ్యాండిచ్చిన కెసీఆర్
X

తెలంగాణ హోం మంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ హ్యాండిచ్చారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ అసెంబ్లీ సీటు తనకు కానీ..తన అల్లుడికి అయినా కేటాయించాలని నాయిని పదే పదే కోరారు. తన అల్లుడికి ఇవ్వటానికి కుదరకపోతే తనకు అయినా ఇవ్వాలని కోరారు. అయినా సరే కెసీఆర్ నాయిని వినతిని పక్కన పెట్టి ఈ సీటును ముఠా గోపాల్ కు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాదు. ఆయనకు బీఫాం కూడా నాయినితో ఇప్పించాలని నిర్ణయించారు. మరి ఈ పరిణామంపై నాయిని ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. టీఆర్ఎస్ తరపున పెండింగ్ లో ఉన్న రెండు స్థానాలకు అభ్యర్దులను ఆ పార్టీ ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది.

కోదాడ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్ కు, ముషీరాబాద్ టిక్కెట్ ను ముఠా గోపాల్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ముషీరాబాద్ నుంచి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ముఠా గోపాల్‌కు ఆ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. బర్కత్ పురాలో సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టిఆర్ఎస్ బిఫామ్ ను ముఠా గోపాల్ తీసుకోనున్నారు. నాయిని ఆశీర్వాదం తీసుకుని సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని చెబుతున్నారు.

Next Story
Share it