కెసీఆర్ కు విశ్రాంతి తప్పదు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు త్వరలో రెస్ట్ తప్పదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని..తాము ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేస్తూ తెలంగాణను ప్రగతి పథం వైపు నడిపిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు కూడా తెలంగాణలోని పలు సభల్లో ప్రసంగించారు. ఈ సభల్లో ఓ వైపు కెసీఆర్ పై పంచ్ లు వేస్తూనే..తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో వివరించే ప్రయత్నం చేశారు. కెసీఆర్ అంటే కావు కమిషన్ రావు (కమిషన్లు తినే వ్యక్తి) అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరధ, ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ ఇలా ప్రతి దాంట్లో అవినీతి
జరిగిందని ఆరోపించారు. టీఆర్ ఎస్ అంటే తెలంగాణ ఆర్ ఎస్ ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి ప్రతి విషయంలో టీఆర్ఎస్ సహకరిస్తూనే వస్తుందని తెలిపారు. ఇది ఇద్దరి మధ్య ఒప్పందం కాక మరేంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేయటంతోపాటు..పలు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే.. సీఎం కేసీఆర్ కుమారుడి ఆదాయం మాత్రం నాలుగు వందల శాతం పెరిగింది. తెలంగాణ వస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు భావించారు. ఏ ఉద్దేశం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో దానికనుగుణంగా అభివృద్ది చెందటంలేదు. మాయ ప్రసంగాలతో
తెలంగాణ ప్రజలన్ని కేసీఆర్ మోసం చేశారు’ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలు ఇద్దరూ ఒక్కటేనని, వారూ మాటలతోనే మాయ చేస్తారని ఎద్దేవ చేశారు. ‘నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేసీఆర్, ఆయన కూతురు రైతులను మోసం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతాం. ఈ జిల్లాలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మోదీ ప్రవేశపెట్టిన గబ్బర్సింగ్ ట్యాక్స్ వల్ల వారికి జీవనోపాధి కరువైంది. మేము అధికారంలోకి రాగానే జీఎస్టీపై సమీక్షించి బీడీ కార్మికులను ఆదుకుంటాం. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్కు వలస వెళ్లి ఇబ్బందుల పాలవుతున్నారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా 500 కోట్లు బడ్జెట్ను కేటాయిస్తాం. రైతులు మద్దతు ధరలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మద్దతు ధరలు అడిగినందుకు రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుంది. భూసేకరణ చట్టాన్ని నీరుగార్చి రైతులను మోసం చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగినా పట్టించుకోలేదు. తెలంగాణలో రెండు లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు కట్టిస్తానన్న కేసీఆర్ కనీసం ఐదు వందల ఇళ్లులు కూడా కట్టలేకపోయారు.