మోడీలా రాహుల్ యాక్షన్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీని ఇమిటేడ్ చేస్తూ రాహుల్ చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. మోరేనాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ నరేంద్రమోదీ వాయిస్ను మిమిక్రీ చేశారు. మోదీ హవాభావాలతో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా..! నన్ను ప్రధాన మంత్రి అని పిలవకండి. చౌకీదార్ అని పిలవండి’ అంటూ తియ్యగా మాట్లాడి నరేంద్ర మోదీ ప్రజల్ని మభ్యపెడతాడని రాహుల్ ఎద్దేవా చేశారు.
ప్రజలను మిత్రులారా అని పేర్కొంటూ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వేల కోట్లు ఎగవేసిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు ‘సోదరుడి’గా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించిందనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వరసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.
https://www.youtube.com/watch?v=8FrwuQ5FuiE