బిజెపికి షాక్!

పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి షాక్ తప్పేలా లేదు. పలు సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీంతో అధికార బిజెపి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది. వాస్తవానికి ఈ రాష్ట్రాల్లో వ్యతిరేక పవనాలు తప్పవనే..పార్లమెంట్ కు కూడా ముందస్తుకు వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఏమి వ్యూహాం పన్నారో తెలియదు కానీ..పార్లమెంట్ ముందస్తుకు బ్రేక్ లు వేశారు. డిసెంబర్ లో ఫలితాలు వెలువడనున్న ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే అది ఖచ్చితంగా మోడీ సర్కారుపై ప్రతికూల ప్రభావం చూపించకతప్పదు. తాజాగా వెల్లడైన సర్వేల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతోందని, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ల్లోనూ కాంగ్రెస్ వైపే మొగ్గు ఉందని తాజాగా వెల్లడైన రెండు ఒపీనియన్ పోల్స్ లోనూ తేలింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ల్లో ఓటరు నాడిని పసిగట్టేందుకు ‘ఏబీపీ న్యూస్– సీఓటర్’, ‘సీ ఫోర్’ సంస్థలు వేర్వేరుగా సర్వేలు జరిపాయి.
ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి పరాజయం ఖాయమేనని ఆ సర్వేల్లో తేలింది. ఏబీసీ– సీఓటర్ మూడు రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించగా, సీఫోర్ రాజస్తాన్లో మాత్రమే సర్వే చేసింది. అయితే, బీజేపీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల్లో ఆ పార్టీకి, కాంగ్రెస్కు మధ్య గెలుచుకునే సీట్లలో ఓట్ల శాతంలో స్వల్ప తేడానే ఉండటం విశేషం. అందువల్ల ఎన్నికల నాటికి చోటు చేసుకునే ఏ స్వల్ప పరిణామమైనా, సీట్ల సంఖ్యలో గణనీయ మార్పును తీసుకువచ్చే అవకాశముంది. ఈ సర్వేలో సీఫోర్ రాజస్తాన్లో 5,788 మంది నుంచి, ఏబీపీ న్యూస్–సీ ఓటర్ మూడు రాష్ట్రాల్లో కలిపి 26, 196 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. రాజస్తాన్లోని మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 49.9 ఓట్ల శాతంతో 142 సీట్లలో గెలవబోతోందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. 34.3 ఓట్ల శాతంతో బీజేపీ కేవలం 56 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోనూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.
సీఎం అభ్యర్థిగా పైలట్కు 36%, ప్రస్తుత సీఎం వసుంధర రాజేకు 27%, కాంగ్రెస్ మరో నేత అశోక్ గెహ్లాట్కు 24% ఓటేశారు. సీఫోర్ సర్వే కూడా కాంగ్రెస్కు 124 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్కు 50%, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయని తెలిపింది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి పరాజయం దిశగా వెళ్తోందని ఏబీపీ– సీ ఓటర్ సర్వే పేర్కొంది. సీఎం అభ్యర్థిగా మాత్రం శివరాజ్సింగ్ చౌహాన్కే అత్యధికులు ఓటేశారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లను గెలుస్తుందని, బీజేపీ 108 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ 42.2%, బీజేపీ 41.5% సాధించనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 0.7 శాతమే తేడా ఉండటం గమనార్హం.