Telugu Gateway
Politics

ముంద‌స్తు ఎందుకో కెసీఆర్ ప్ర‌జ‌ల‌కు చెప్పాలి

ముంద‌స్తు ఎందుకో కెసీఆర్ ప్ర‌జ‌ల‌కు చెప్పాలి
X

బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా తెలంగాణ ఆప‌ధ్ద‌ర్మ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత కెసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో అంద‌రి కంటే ముందు జ‌మిలి ఎన్నిక‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన కెసీఆర్ ఎందుకు ముంద‌స్తు కు వెళుతున్నార‌ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై అన‌వ‌స‌ర‌పు భారం వేయాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింద‌ని నిల‌దీశారు. ఇదంతా కుటుంబ ప్ర‌యోజ‌నాల కోస‌మే అని ఎద్దేవా చేశారు. తాము కుటుంబ రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకిస్తామ‌ని ప్ర‌క‌టించారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించి మోసం చేశార‌న్నారు. త‌మ‌కు టీఆర్ఎస్ తో పొత్తు, ఎలాంటి అవ‌గాహ‌న లేద‌న్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటులో త‌మ పార్టీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని, తెలంగాణ‌లోని 119 సీట్ల‌తో త‌మ పార్టీ బ‌రిలో ఉంటుంఆద‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం మ‌జ్లిస్ కు భ‌య‌ప‌డే తెలంగాణ సర్కారు సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం చేయటం లేద‌న్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేంద్రానికి పంపారు. కేసీఆర్‌కు తెలుసు... బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని.. అయినా బిల్లు పంపారు. కేసీఆర్‌ వస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తార’ని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ‘తెలుగు నేతలు అంజయ్య, పీవీ నర్సింహారావులను కాంగ్రెస్‌ పార్టీ ఏవిధంగా అవమానించిందో అందరికీ తెలుసు. కనీసం 2018లో అయినా దళితుడిని సీఎం చేస్తారా చెప్పండి అని కెసీఆర్ ను ప్ర‌శ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించాం. కొత్త జిల్లాల ఏర్పాటు అయ్యాక ఒక్క జిల్లా అయినా అభివృద్ధి చెందిందా? ఖమ్మం జిల్లాలో రైతులకు ఈ సర్కార్‌ బేడీలు వేసింది. రైతులకు బీజేపీ మద్ధతు ధర పెంచింది. సిరిసిల్లలో దళితుల మీద దాష్టీకం జరిగింది. 14వ ఆర్ధిక సంఘం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయ’ని ఆరోపించారు. ‘ఓబీసీలకు కాంగ్రెస్‌ సర్కార్‌ మోసం చేస్తే మోదీ న్యాయం చేశారు. కాంగ్రెస్‌ ఎందుకు రాజ్యసభలో ఓబీసీ బిల్‌ ఆపింది. ట్రైబల్‌, వెటర్నరీ, జయశంకర్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేశాం. ఎయిమ్స్‌కు రూ.1200 కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్‌ సర్కార్‌ కన్నా 20 రెట్లు అధికంగా తెలంగాణకు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ లేకపోయినా ఫెడరల్‌ స్ఫూర్తికి గౌరవం ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామాల్లో తిరుగుతాం. కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజల మద్ధతు కావాలి. రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ సర్కారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నార’ని అమిత్‌ షా తెలిపారు. సాయంత్రం మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారు. రాహుల్ గాంధీ బిజెపిని విమ‌ర్శించ‌టంలో పెద్ద వింత ఏమీలేద‌న్నారు.

Next Story
Share it