Telugu Gateway
Telangana

కెసీఆర్..కెటీఆర్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్..కెటీఆర్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
X

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కెటీఆర్ ను సీఎం చేసి..కెసీఆర్ పార్లమెంట్ కు వెళతారని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు సీఎంగా కెసీఆరే బాధ్యతలు చేపడతారని..తర్వాత సీఎం పీఠంపై కెటీఆర్ ను కూర్చోపెట్టి ఆయన పార్లమెంట్ కు వెళతారని స్పష్టం చేశారు. ఈ ప్లాన్ ఇప్పటికే రెడీ అయిందని అన్నారు. ఎంత చేసినా టీఆర్ఎస్ కు 50 నుంచి 60 సీట్లు మించి రావని అంచనా వేశారు. మారుతున్న సమీకరణల కారణంగా అది కూడా అనుమానమే అని తెలిపారు. ఓ ఛానల్ తో మాట్లాడుతూ కొండా సురేఖ పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో మళ్లీ రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందన్నారు. ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా తనను చూసి ఓట్లు వేస్తారనే అహంకారంతో కెసీఆర్ ఉన్నారని సురేఖ అరోపించారు. మంత్రులు..ఎమ్మెల్యేలకు అసలు నోరువిప్పి మాట్లాడే పరిస్థితిలేదని తేల్చిచెప్పారు.

ప్రజల్లో పట్టు ఉన్నందునే తాము బయటకు వచ్చామని అన్నారు. ఎన్నికల తర్వాత కెసీఆర్ కు అసలు విషయం తెలుస్తుందని అన్నారు. టీఆర్ఎస్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీకాదని..వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే తనను చేర్చుకున్నారని వెల్లడించారు. కెటీఆర్ తో కొన్ని అంశాలపై తనకు విభేదాలు వచ్చిన మాట వాస్తవమే అన్నారు. కెటీఆర్ తన చుట్టూ ఓ ఏడుగురితో కోటరీ ఏర్పాటు చేసుకున్నారని..వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని..వినాయక చవితి నవరాత్రులు ముగిసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే బహిరంగ లేఖ విడుదల చేస్తామన్నారు.

Next Story
Share it