వరవరరావుకు ఊరట..సుప్రీం కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కుల నేతలకు భారీ ఊరట. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 5వ తేదీ వరకూ హౌస్ అరెస్టులోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వరవరరావుతో పాటు మిగిలిన నేతలకు ఊరట లభించినట్లు అయింది. అదే సమయంలో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అసంతృప్తి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ వంటిదని పేర్కొంది. దాన్ని కూడా తీసేస్తే ప్రెషర్ కుక్కర్ పేలిపోతుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఇందులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు ఎ ఎం కన్వాలికర్, డీ వై చంద్రచూడ్ ఉన్నారు. హక్కుల నేతలను కేవలం హౌస్ అరెస్టులోనే ఉంచాలని ఆదేశించిన కోర్టు...ఈ పిటిషన్పై తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. వరవరరావుతో సహా మరో నలుగురు హక్కుల నేతల అరెస్టు లపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పౌరహక్కుల నేతల అరెస్ట్ ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా సుప్రీం ఆదేశాలతో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్లు అయింది.