Telugu Gateway
Telangana

ప్ర‌గ‌తి భ‌వ‌న్ దాట‌ని ప్ర‌గ‌తి

ప్ర‌గ‌తి భ‌వ‌న్ దాట‌ని ప్ర‌గ‌తి
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తెలంగాణ జ‌న‌సమితి అధ్య‌క్షుడు కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో లాభ‌ప‌డింది ఒక్క కెసీఆర్ కుటుంబం త‌ప్ప‌..మ‌రెవ‌రూ లేరని అన్నారు. ప్ర‌గ‌తి ఇంత వ‌ర‌కూ ప్ర‌గ‌తిభ‌వ‌న్ దాట‌లేద‌ని ఎద్దేవా చేశారు. నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లుగానే తెలంగాణ ఉద్యమకారులను కూడా గౌరవించాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవినీతిలో నెంబర్‌ 2గా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబర్‌ 12న దీక్ష చేస్తామని తెలిపారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోందన్నారు.

దేశంలో సెక్రటేరియట్‌కు రాని నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ ను గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు. సమయానుకూలంగా తాము కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ‘‘25,000 మంది వీఆర్‌ఏలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని వస్తుంటే వారిని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలి. రింగ్ రోడ్డును మార్చుతున్నారు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ రైతుల భూములు ఇవ్వమని అభ్యంతరం తెలిపినా వినటం లేదు. అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. వారిది ప్రగతి నివేదన మాది ప్రజల ఆవేదన. ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేద‌న్నారు.

Next Story
Share it