ఎందుకీ కెసీఆర్ ముందస్తు హైరానా?
ముందస్తు ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నా దీనిపై క్లారిటీ మాత్రం డిల్లీ పర్యటన తర్వాతే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వపరంగా..పార్టీ పరంగా కెసీఆర్ నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందస్తుకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో కెసీఆర్ శుక్రవారం నాటి సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అయితే ముందస్తు ఎన్నికలకు సీఎం కెసీఆర్ ఎన్నికల సంఘానికి కారణం ఏమి చెబుతారు?. వాస్తవానికి కెసీఆర్ అక్కడ కారణం చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎన్నికల సంఘం కూడా కెసీఆర్ కోరినట్లు ముందస్తు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మాకు రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి..ముందస్తుకు వెళతాం..సహకరించాలని కోరతారా?. ఆలశ్యం అయితే పార్టీకి కష్టాలు పెరుగుతాయి కాబట్టి..ఎర్లీగా మా ఎన్నికలు పూర్తి చేసుకుంటామని చెబుతారా?. రాజకీయ కారణాలను కేంద్ర ఎన్నికల సం|ఘం ఎందుకు పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిపై ఎవరైనా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటి?. ఎలాంటి సహేతుకమైనా కారణం లేకుండా ఎందుకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. నవంబర్-డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిపినా మళ్లీ నాలుగైదు నెలల తేడాతోనే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కదా? రెండు సార్లు ఖర్చు ఎందుకు? అసలు అంత అత్యవసరంగా తెలంగాణలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముంది?. కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే ప్రజలపై అనవసర భారాన్ని ఎందుకు వేయాలి?.ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు లేవు.
ప్రధాని మోడీతో సమావేశం అయి పలు అంశాలపై క్లారిటీ తెచ్చుకునేందుకే కెసీఆర్ ఆకస్మికంగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని చెబుతున్నారు. అందుకే ఎక్కువ మంది సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని నమ్ముతున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం సెప్టెంబర్ 2 సభ ద్వారా తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే ఢిల్లీలో జరిగే పరిణామాలను బట్టే భవిష్యత్ అడుగులు ఉంటాయని చెబుతున్నారు. శుక్రవారం నాటి ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంపై ఎంతో హైప్ క్రియేట్ అయినా..కెసీఆర్ అరగంటలోనే సమావేశాన్ని ముగించేసి డిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు. మొత్తానికి అధికార పార్టీ ఎన్నికల వేడి పెంచే పనిలో మాత్రం ఉంది. ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తే కాంగ్రెస్ కు ఓటమి భయం అంటారనే కారణంతో ఆ పార్టీ కూడా షెడ్యూల్ కంటే ముందే ఓడిపోయి కెసీఆర్ ఇంటికి పోతామంటే తామెందుకు వద్దంటామని వ్యాఖ్యానిస్తూ ధీమాను ప్రదర్శిస్తోంది. మెజారిటీ ఉన్న పార్టీగా కెసీఆర్ కు అసెంబ్లీని రద్దు చేసి..ఎన్నికలకు పోవాలని కోరుకునే అధికారం ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి ఆయన ప్రజలకు ఏమి సమాధానం చెబుతారన్నదే ఆసక్తికర అంశం.