వైసీపీలోకి మాజీ మంత్రి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి వైసీపీలో చేరారు. పాదయాత్రలో ఉన్న జగన్ తో భేటీ అయి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి..పోటీ కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు వైసీపీ గూటికి చేరినట్లు కన్పిస్తోంది. ఆయన ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. కందుకూరు నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చిన మహిధర్ రెడ్డిని వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన తర్వాత మహిధర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరైనా వైఎస్ జగన్ను బలపరిచే పరిస్థితులున్నాయన్నారు.
రాష్ట్రంలో మార్పును, జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను సంపూర్ణంగా నెరవేరుస్తానని జగన్ అంటున్నారని, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడై వైఎస్సార్సీపీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్దినే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.