Telugu Gateway
Andhra Pradesh

300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి

300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి
X

ఇంత బంపర్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా?. పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం అర్థం లేని ప్రతిపాదన. కానీ ఒక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఇది అద్భుతమైన ప్రాజెక్టు. ఎందుకంటే ఆయనకు కూడా ఇందులో అద్భుతంగా గిట్టుబాటు అవుతుంది కాబట్టి. లేకపోతే ఇలా ఎవరైనా చేస్తారా?. 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే సింగపూర్ సంస్థలకు ఏకంగా 6764 కోట్ల రూపాయలు విలువ చేసే ఇచ్చేస్తారా? అంటే చంద్రబాబు ఇచ్చేస్తున్నారు మరి. పోనీ అందులో సగం ఏపీ ప్రభుత్వానికి తిరిగి వచ్చేస్తుంది అనుకున్నా కూడా ఈ ప్రతిపాదనలో ఏ మాత్రం జస్టిఫికేషన్ ఉండదు. 300 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 6764 కోట్ల రూపాయల విలువైన భూమి ఇవ్వటం ఒక్కటే కాదు...ఈ 1691 ఎకరాల చుట్టూ ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మౌలికసదుపాయాలు కల్పించాల్సింది కూడా చంద్రబాబు సర్కారే. అంతే కాదు...ఈ భూములపై రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి మినహాయింపులు కూడా అదనం. అదేంటి అంటే...జీఎస్ డీపీ పెరిగిపోతుంది...లక్షల ఉద్యోగాలు వస్తాయని సర్కారు ప్రజలకు నమ్మించే ప్రయత్నం చేస్తోంది.

సింగపూర్ సంస్థల కోసం ఏకంగా ఏపీలో ఉన్న చట్టాలను కూడా తుంగలో తొక్కి మరీ ఆ సంస్థలకు ప్రయోజనం కల్పించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేశారు. అందుకే వాళ్ళు కోరుకున్నట్లు ఒప్పందాలు అన్నీ..మారిపోయాయి. వారికి అనుకూలంగా క్లాజులు వచ్చేశాయి. అంతే కాదు..సొంత పెట్టుబడే కాదు..ఈ భూములను తనఖా పెట్టుకుని కూడా ఆయా సంస్థలు బ్యాంకుల నుంచి రుణం పొందే వెసులుబాటు కల్పించారు. తొలి దశలో విక్రయించనున్న 656 ఎకరాల విక్రయ కనీస ధరను నాలుగు కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

ఈ లెక్కను పరిగణనలోకి తీసుకుంటేనే ఈ భూమి విలువ 6764 కోట్ల రూపాయలు అవుతుంది. సింగపూర్ సంస్థలు చెబుతున్నట్లు నిజంగా తొలి దశ పూర్తి చేస్తే మిగిలిన భూమి ధర మరింత పెరగటం ఖాయం. ఆ లెక్కన భూమి విలువ ఏకంగా పది కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదు. పదిహేను సంవత్సరాల్లో ఈ మొత్తం ప్రాజెక్టును అమలు చేయాలి. అంటే సుమారు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సింగపూర్ సంస్థలకు పదిహేను సంవత్సరాల్లో నికరంగా వచ్చే లాభం కనీసం ఐదు వేల కోట్ల రూపాయలపై మాటే. మరి ఇందులో స్కామ్ లేదా?. అందులో చంద్రబాబు వాటా లేదా?. లేకపోతే ఇంత ఉదారంగా ఆ సంస్థలకు భూములు ఎలా ఇచ్చేస్తారు?.

Next Story
Share it