పవన్ కళ్యాణ్ ‘ట్వీట్ వార్’
![పవన్ కళ్యాణ్ ‘ట్వీట్ వార్’ పవన్ కళ్యాణ్ ‘ట్వీట్ వార్’](http://telugugatewaysite.vocalwire.com/wp-content/uploads/2018/02/pawan-kalyan.jpg)
జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్విట్టర్ ద్వారా పలు అంశాలపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం పెద్ద సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశంతోపాటు విజయవాడలో నాయీ బ్రాహ్మణులతో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు...అమరావతిలో భూసేకరణ అంశాలపై పవన్ ట్వీట్లు చేశారు. అమరావతికి ఇప్పటికే కావాల్సినంత భూమి సేకరించారని..ఇంకా అదనంగా భూసేకరణ చట్టం ద్వారా రైతుల భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదన్నారు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ కబ్జాలకు అండగా నిలుస్తోందంటూ విమర్శులు గుప్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరుగుతున్న పరిణమాలపై కూడా పవన్ స్పందించారు. రమణ దీక్షితులు ప్రస్తావిస్తున్న అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పింక్ డైమండ్తో పాటు ఇతర ఆభరణాల అదృశ్యంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏ మాత్రం సహేతుకంగా లేదన్నారు.
కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో తనను కలిసిన ఓ వ్యక్తి టీటీడీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారని ట్వీట్లో పవన్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ప్రకారం వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు విదేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయం ప్రతిపక్ష టీడీపీ నాయకులకు తెలుసని సంచలన విషయాన్ని బయటపెట్టారు. టీడీపీ నేతలను ప్రతిపక్ష నేతలుగా పేర్కొన్నారు. బహుశా మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారనే భావన కావొచ్చు. పవన్ చేసిన ఈ ట్వీట్ కాస్త గందరగోళంగానే ఉంది. రమణ దీక్షితుల ఆరోపణలు తనకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదని చెప్పారు. ఆభరణాలను దొంగిలించిన వారు బాలాజీ మాట్లాడలేరని, ఆయన్ను దోచుకుంటే ఏం కాదని అనుకుంటున్నారని అన్నారు. నాయీ బ్రాహ్మణుల సమస్యలపై సీఎం స్పందించిన తీరు ఏ మాత్రం సరికాదన్నారు.