Telugu Gateway
Andhra Pradesh

పునాదులనూ జాతికి అంకితం చేస్తున్న చంద్రబాబు

పునాదులనూ జాతికి అంకితం చేస్తున్న చంద్రబాబు
X

ఇది ఓ ప్రపంచ రికార్డుగా మారబోతోంది. ఎందుకంటే ఇలా పునాదులను కూడా జాతికి అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రులను మీరు గతంలో ఎప్పుడూ చూసి ఉండరు కనుక. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పేరున ఓ కొత్త చరిత్ర లిఖించుకోబోతున్నారు సోమవారం . చంద్రబాబునాయుడికి ప్రతిదీ పండగే. ప్రతి సందరర్భమూ ఈవెంటే. పోలవరం ఏపీకి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అనటంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు 2018 చివరి నాటికి పోలవరం తొలి దశ పూర్తి చేస్తాం. గ్రావిటీ ద్వారా నీరందిస్తాం అంటూ ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు పోలవరం ‘డయాఫ్రమ్ వాల్’ ( ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన పునాది) ని జాతికి అంకితం చేస్తారంట. దీనినొక ఈవెంట్ గా చేస్తున్నారు చంద్రబాబు. 412 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం నిజంగా రికార్డే . ఇందులో ఎలాంటి వివాదాలకు తావు లేదు. కానీ చంద్రబాబు ఏకంగా పోలవరంలో లేని తొలి దశ ప్రాజెక్టునే 2018 డిసెంబర్ కు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు పలుమార్లు. అయినా డయాఫ్రమ్ వాల్ ని జాతికి అంకితం చేసేది ఏమిటి?.

ఎవరైనా జాతికి అంకితం అంటే పూర్తి అయిన ప్రాజెక్టును చేస్తారు. కానీ చంద్రబాబులా పునాదులను ఓ సారి, గోడలను...కాలువలను ఇలా జాతికి అంకితం చేసుకుంటూ పోతారా?. ఇప్పటికే పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ పై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కావటంతో ఈ పనులు ఇఫ్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఉన్నతాధికారులు సూచించినట్లు ట్రాన్స్ స్ట్రాయ్ ను పక్కకు తప్పించి...పోలవరం పనులను పరుగులు పెట్టించి ఉంటే..పరిస్థితి మరోలా ఉండేదని సాగునీటి శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అధికారులు..ఇంజనీర్లు ఎంత మంది చెప్పినా చంద్రబాబు మాత్రం ‘ట్రాన్స్ స్ట్రాయ్’పై ఈగవాలనీయకుండా చూశారు నిన్నమొన్నటివరకూ. అడ్డుచెప్పిన అధికారులను కూడా పక్కకు తప్పించారు. కానీ చివరకు ట్రాన్స్ స్ట్రాయ్ ఉంటే పని ముందుకు సాగదని గుర్తించిన చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

ఒకప్పుడు అడ్డగోలుగా వెనకేసుకొచ్చిన ట్రాన్స్ స్ట్రాయ్ నుంచి అన్ని పనులు తప్పిస్తూ ఇతరులకు అప్పగించేస్తూ కమిషన్లు దండుకునే పనిలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. అదే సమయంలో అంచనాలు కూడా అడ్డగోలుగా పెంచేస్తూ సాగుతున్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు పోలవరంలో జాప్యం నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారు. కానీ కేంద్రంలోని ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చింది ఈ ఏడాది మార్చిలోనే. అంటే నికరంగా మూడు నెలలే గడించింది. కానీ తన తప్పులను కూడా ఇప్పుడు కేంద్రంపై నెట్టేసి..అంచనాలు పెంచటంతోపాటు..ప్రతి దాన్ని ఓ ఈవెంట్ గా చేసి ప్రజలను మభ్యపెట్టడంలో మాత్రం చంద్రబాబు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు.

Next Story
Share it