Telugu Gateway
Telangana

టాలీవుడ్ ‘ట్రెండ్ మారింది’

టాలీవుడ్ ‘ట్రెండ్ మారింది’
X

కొత్త మార్పు. హీరోల్లో ఎవరూ ఊహించని మార్పు. ఒకరి ఆడియో ఫంక్షన్ కు మరొకరు. హీరోలు అందరూ కలసి పార్టీలు. ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ బాగా మారింది. గతంలో ఎప్పడూ నవతరం హీరోలు ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకోకపోయినా...సినిమాల్లో డైలాగుల రూపంలో మాత్రం ‘పంచ్ లు’ వేసుకునే వారు. ఏ హీరో ఎవరిని టార్గెట్ చేసి డైలాగులు చెప్పారో అర్థం చేసుకోవటం పెద్ద కష్టం అయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారణం ఏమైనా ఇది పరిశ్రమకు మంచిదే అని అందరూ ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో యువ హీరోలు అందరూ స్నేహగీతం ఆలపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతే కాదు.. ఆ తర్వాత మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ కలసి ఓ పార్టీ చేసుకున్నారు. రామ్ ఛరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ కావటంతో రామ్ చరణ్ కూడా పార్టీ ఇఛ్చారు. ఓ హీరో తన ఫంక్షన్ లో ఇతర హీరోల సినిమాల గురించి ప్రస్తావించటం అరుదు.

కానీ ఈ మధ్యే జరిగిన నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ తాజా సినిమాలు అయిన రంగస్థలం, భరత్ అను నేను సినిమాల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు పరిశ్రమలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో టాప్ హీరోలు ఎవరూ తమ సాటి హీరోల పంక్షన్లకు రావటం అరుదుగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తాజాగా ఇప్పుడు మరో అరుదైన కలయికకు రంగం సిద్ధం అయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘నేలటిక్కెట్’ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ నెల 10న జరిగే కార్యక్రమానికి పవన్ హాజరు అవుతున్నట్లు ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మరెన్ని మార్పులకు కారణం అవుతాయో వేచిచూడాల్సిందే. తాజాగా మహానటి సినిమా ఫంక్షన్ కు కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Next Story
Share it