Telugu Gateway
Andhra Pradesh

సెజ్ భూములతో 1100 కోట్లకు ‘నవయుగా టెండర్’!

సెజ్ భూములతో 1100 కోట్లకు ‘నవయుగా టెండర్’!
X

ప్రత్యేక ఆర్థిక మండలి పేరు చెప్పి కారుచౌకగా భూములు దక్కించుకున్న సంస్థ నవయుగా గ్రూప్ నకు చెందిన కృష్ణపట్నం ఇన్ ఫ్రా. భూ కేటాయింపులు జరిపి సంవత్సరాలు గడుస్తున్నా కంపెనీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తేలేదు. అంతే కాదు.. ఆ ప్రాజెక్టులో అడుగు ముందుకు పడలేదు. కాంగ్రెస్ సర్కారు ఏకంగా ఈ భూ కేటాయింపును రద్దు చేయటానికి రంగం సిద్ధం చేసింది. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నవయుగా’తో బంధం బలపడింది. అంతే...ఈ భూ కేటాయింపుల రద్దు సంగతి పక్కన పెట్టి..వేల కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టులు ఇఛ్చారు. అంతే కాదు...పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఓ 1400 కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై మరీ అప్పగించారు. ఇదంతా ఒకెత్తు అయితే...ప్రభుత్వం నుంచి కారుచౌకగా దక్కించుకున్న వేలాది ఎకరాలను ఆర్థిక సంస్థలకు తనఖా పెట్టి 1100 కోట్ల రూపాయల రుణం తీసుకుంటామని...దీనికి నిరంభ్యతర పత్రం (ఎన్ వోసీ) ఇవ్వాలంటూ కంపెనీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ)కి దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనను ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య తోసిపుచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఈ సంస్థకు ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా ఈ ప్రతిపాదన ఆగిపోతుందా?. లేక సీఎం స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకుంటారా? అన్నది వేచిచూడాల్సి ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వైఎస్ హయాంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. కడపలో బ్రాహ్మణి స్టీల్స్ కోసం కేటాయించిన భూమిని తనఖా పెట్టి గాలి జనార్థన్ రెడ్డి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జి హబ్ లోనూ ఇదే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు జమానాలోనూ కృష్ణపట్నం ఇన్ ఫ్రా టెక్ అచ్చం అదే మోడల్ లో సర్కారు భూమితో వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చుకుని దందా చేసేందుకు రెడీ అవుతోంది. అంటే పరిశ్రమల పేరు చెప్పి ప్రభుత్వం నుంచి వేల ఎకరాలు తీసుకోవటం. అదే భూమిని తనఖా పెట్టి బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తెచ్చుకోవటం. ఆ డబ్బుతో వ్యాపారం చేయటం.

ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు కాకుండా ఇలాంటి వ్యవహారాలు ముందుకు సాగవని పరిశ్రమల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే చంద్రబాబు కంపెనీ ప్రతిపాదనను ఓకే చెబుతారా? లేక ఏపీఐఐసీ ఛైర్మన్ ప్రతిపాదనను ఆమోదింపచేస్తారా? అన్నది పరిశ్రమల శాఖలో ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. నవయుగా గ్రూపునకు చెందిన కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కోసం అంటూ 2009లో అప్పటి కాంగ్రెస్ సర్కారు కారుచౌకగా ఐదు వేల ఎకరాలు కేటాయించింది. అసలు ఈ సెజ్ కోసం మొత్తం 12 వేల ఎకరాలు కేటాయించాలని నిర్ణయించినా..కంపెనీ పేర మాత్రం ఐదు వేల ఎకరాలు బదిలీ చేశారు. పారిశ్రామికంగా అత్యంత కీలకమైన నెల్లూరు జిల్లాలో ఈ భూమిని ఎకరా రెండు లక్షల రూపాయల లోపు ధరకు కేటాయించటం విశేషం. ఇప్పుడు అదే భూమిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల రుణం తెచ్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Next Story
Share it