Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కంటే జగనే ముందు...కెసీఆర్ మరీ వెనక

చంద్రబాబు కంటే జగనే ముందు...కెసీఆర్ మరీ వెనక
X

భారత్ లోని శక్తివంతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు చోటు దక్కింది. రెండు రాష్ట్రాల నుంచి కలుపుకుంటే ఏకంగా నలుగురికి చోటు దక్కితే ముగ్గురు ఏపీకి చెందిన వారు. మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈ వంద మందిలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి 35వ ర్యాంక్ రాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 36వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ర్యాంకుల్లో 52వ స్థానంలో ఉన్నారు. వాస్తు నమ్మకాలతో ఆయన కొన్ని సంవత్సరాల నుంచి సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టడంలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. దేశంలో శక్తిమంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని మోడీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. మోడీ నెంబర్‌ వన్ స్థానంలో ఉండగా.. అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు. సోనియాగాంధీ ఐదో స్థానంలో ఉన్నారు. మమతా బెనర్జీ ఆరో స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు.

రాహుల్‌ గాంధీ శక్తిమంతుల జాబితాలో 11 వ స్థానం సొంతం చేసుకున్నారు.. చంద్రబాబుకు గట్టి ప్రత్యామ్నాయంగా వైఎస్‌ జగన్ నిలిచారని ఇండియన్ ఎక్స్‌ ప్రెస్ పత్రిక వివరించింది. ప్రత్యేక హోదా కోసం నిరంతరం ఒత్తిడి తీసుకురావడంలో, చంద్రబాబు, బీజేపీ మధ్య బంధం తెగిపోవడానికి జగనే కారణమని అభిప్రాయపడింది. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటున్నారని పేర్కొంది. ఈ జాబితాలో 36వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తేవడంలో కృషి చేస్తున్నారని పేర్కొంది. ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పటికీ సొంత రాష్ట్రంలో చంద్రబాబుకు ఇల్లు లేదని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఉండవల్లి సమీపంలో ఒక అద్దె ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారని వివరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శక్తివంతుల జాబితాలో 52వ స్థానం దక్కింది. ధర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్‌ ప్రయత్నాలను వివరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 58వ స్థానంలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మినహా మరో నాయకుడు లేకపోవటం విశేషం.

Next Story
Share it