Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోని ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లపై సీబీఐ కేసు!

ఏపీలోని ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లపై సీబీఐ కేసు!
X

ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార వ్యవస్థలో భారీ కుదుపు రానుందా?. అంటే అవునంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికీ సీబీఐ పక్కా సమాచారం సేకరించింది. ఈ ఐదుగురిలో ముగ్గురు కీలక అధికార కేంద్రంలో ఉండగా...మరో ఇద్దరు అత్యంత ముఖ్యమైన శాఖల్లో ఉండటం విశేషం. అవినీతి ఆరోపణల కారణంగానే ఈ కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల క్రితమే కేంద్రంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంది. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలు ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపిస్తోంది. దీనికి తోడు కొత్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా చంద్రబాబు సర్కారు అవినీతిపై వరస పెట్టి విమర్శలు చేస్తున్నారు.

నేరుగా రాజకీయ నేతలపై కేసులు వంటివి పెడితే అది రాజకీయ కక్ష సాధింపు కిందకు వస్తుందనే ఉద్దేశంతో తొలి దశలో ఐఏఎస్ లను టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో కూడా ప్రభుత్వానికి అడ్డగోలుగా సహకరించి..భారీ అవినీతికి కారణమైన వారిని ఎంపిక చేశారని...దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఇఫ్పటికే సీబీఐ సేకరించిందని సమాచారం. అయితే సీబీఐ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత రంగంలోకి దిగుతుందా?. లేక ఏప్రిల్ మొదటి వారంలో ‘ఆపరేషన్ స్టార్ట్’ చేస్తుందా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఏకంగా ఒకేసారి ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లపై అవినీతి ఆరోపణలపై కేసులు నమోదు చేస్తే అది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎన్ని సంచలనాలకు కేంద్రం అవుతాయో.

Next Story
Share it