మొబైల్..బ్యాంకు ఖాతాల కు ఆధార్ అక్కర్లేదు
అందరిలో ఒకటే టెన్షన్. మార్చి 31లోగా ఆధార్ ఇవ్వకపోతే మొబైల్ పనిచేయదు. బ్యాంకులో లావాదేవీలు జరపలేం. దీంతో చాలా మంది ఈ నెలలో ఎలాగైనా ఈ అనుసంధానం పూర్తిచేసుకోవాలనే టెన్షన్ లో ఉన్నారు. అలాంటి వారందరికీ సుప్రీంకోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. దీని ప్రకారం మార్చి 31లోగా మొబైల్ ఫోన్లకు..బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే వారు మాత్రం ఆధార్ కార్డు అందజేయాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలు తదితరాలకు ఆధార్ అనుసంధానం గడువును దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎకె సిక్రీ, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రకుడ్, అశోక్ భూషణ్తో కూడిన ఐదుగురు న్యాయనిర్ణేతల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది విచారణ పూర్తయ్యేంతవరకు ఎలాంటి డెడ్లైన్ లేదని తేల్చి చెప్పింది. అసలు బ్యాంకు ఖాతాలు, మొబైల్ లాంటి సేవలకు ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదని తెలిపింది. ఆధార్ తప్పనిసరి, ఆధార్ గోప్యతపై పలు పిటీషన్లపై విచారించిన సుప్రీం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతా, మొబైల్, తత్కాల్ పాస్పోర్ట్ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమవుతుందని పేర్కొంది.