Telugu Gateway
Telangana

కెసీఆర్ కు జెఏసీ కౌంటర్..విద్యుత్ పై వాస్తవాలు ఇవిగో

తెలంగాణ రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా జనవరి 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కొత్త సంవత్సరం రోజు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇఛ్చారు. ప్రభుత్వం ప్రచారం అలా ఉంటే...అసలు 24 గంటల విద్యుత్ సరఫరాలో అసలు కెసీఆర్ గొప్పదనం ఏమీలేదని అసలు విషయాలు ఇవిగో అంటూ జెఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేంటో మీరూ చూడండి. చేసిన వాగ్దానాలనన్నింటినీ గాలికి వదిలేసి -( నిరుద్యోగ సమస్య, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ, ఫీజు రీయింబర్స్మెంట్...చెప్పాలంటే లిస్టు పెద్దదే...), హాస్టళ్లలో చలికి గజగజ వణుకుతున్న పిల్లలకు కనీసం దుప్పట్లు ఇవ్వకుండా, అమ్మాయిలకు స్కూళ్లలో, హాస్టళ్లలో టాయిలెట్లను కట్టివ్వలేని ఈ ప్రభుత్వం, రైతులకు 24గంటల విద్యుత్తుపై అంత ఆసక్తి ఎందుకు? అసలు ఎలా ఇవ్వగలుగుతున్నది? ఇదంతా మన ముఖ్యమంత్రి దీక్షా దక్షతనేనా? అన్నింటిలో విఫలమైన ఈ ప్రభుత్వం ఈ ఒక్క అంశంలో సఫలమైందంటే నమ్మశక్యం కాదు...ఇందులో అసలు మతలబు తెలుసుకోవాల్సిందే...రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్య పరిష్కరించామనీ, అదంతా తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. ఇదంతా ప్రభుత్వం సాధించిన విజయమని కొందరు ఊదర కొడుతున్నారు. వాస్తవాలు తెలియకుంటే ఈ ప్రచారం నిజమని నమ్మే ప్రమాదం ఉంది. నిజానికి ప్రస్తుతం దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్తు పరిస్థితులు నెలకొన్నాయి. అమ్ముదామన్నాకొనే నాధుడు లేడు. గతంలో మొదలు పెట్టిన వేల మెగా వాట్ల ప్రాజెక్టులు 2015 నుండి ఉత్పత్తి మొదలు పెట్టడం ఇందుకు ప్రధానమైన కారణం. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ సి‌ఈ‌ఏ 2017-18 నివేదికలో స్పష్టంగా ఇవ్వబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ (సి‌ఈ‌ఏ) 2017-18 వార్షిక నివేదిక ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి

2016-17 లో కోతలు లేకుండా మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రాలు

చండీఘర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా , గుజరాత్, గోవా , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పాండిచేరి, కేరళ, సిక్కిం, ఒడిశా, వెస్ట్ బెంగాల్ , జార్ఖండ్, మేఘాలయ. మొత్తం 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో అసలు విద్యుత్ కోతలు లేవు. ఇంకా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం , నాగాలాండ్, త్రిపుర, బీహార్ రాష్ట్రాల్లో కేవలం 1 నుండి 2 శాతం లోటు ఉంది.

అలాగే 2017-18 సంవత్సరంలో...

27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉండదని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా అతితక్కువ కొరత ఉంటుందనీ, ఒకవేళ ఉన్నా వాళ్ళు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుక్కోవడం ద్వారా కోతను అధిగమించడం సాధ్యమవుతుందనీ రిపోర్టులో పేర్కొన్నారు. 2017-18లో దేశంలో అవసరమైన విద్యుత్తు 1229661 మిలియన్ యూనిట్లు కాగా, లభ్యత 1337828 మిలియన్ యూనిట్లు, మిగులు 108167 మిలియన్ యూనిట్లు. అంటే అవసరమైన విద్యుత్తు కన్నా లభ్యత ఎక్కువగా ఉందన్నమాట. తెలంగాణ వచ్చిన తరువాత మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్టూ ఇప్పటివరకూ ఉత్పత్తి మొదలు పెట్టలేదు. ఉత్పత్తి చేస్తున్నవన్నీ గతంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులే... రైతులు కూడా 9గంటల విద్యుత్తును సక్రమంగా సరఫరా చేయమని అడుగుతున్నారు తప్ప 24గంటల విద్యుత్తును కొరటంలేదు. భూగర్భజలాలు పెరిగిన తరువాత 24గంటల సరఫరా చేయొచ్చని రైతులు మొత్తుకుంటున్నా వినడంలేదు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సుమారు ₹10000కోట్ల భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. ప్రభుత్వం మాత్రం కేవలం ₹5500కోట్ల మేరకే భారాన్ని భరిస్తానంటున్నది. ఇప్పటికే విద్యుత్ సంస్థలు చేస్తున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ళ ఖర్చులకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్ సంస్థలు ఆర్ధికంగా నష్టాల బాట పట్టాయి. రైతులకు గిట్టుబాటుదర లేదు...దొరికెవన్నీ నకిలీ విత్తనాలే... పంటల బీమా లేదు...రుణ మాఫీ అరకోరే...కొత్తగా రుణాలు దొరకడంలేదు... ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోని దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు రికార్డు అయితే పట్టించుకునే నాధుడు లేడు. ?తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ షాకుల ద్వారా మరణించిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది.2014లో 400 చనిపోతే, 2017నాటికి మరణాల సంఖ్య 600దాటింది.సరఫరాలో నాణ్యత పెరుగుతే, కరెంటు షాకుతో మరణాలు ఎందుకు పెరుగుతున్నట్లు? ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా, 24గంటల సరఫరా అంటూ ఊదరగొట్టడం దేనికి? అంటూ జెఏసీ సర్కారుపై పలు ప్రశ్నల వర్షం కురిపించింది.

Next Story
Share it