పవన్ కాన్వాయ్ పై చెప్పు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్. ఆయన కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. దీంతో కొద్ది సేపు కలకలం రేగింది. పవన్ తెలంగాణ టూర్ ప్రారంభం అయినప్పటి నుంచి రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై పవన్ పొగడ్తల వర్షం కురిపిస్తుంటే..ఆయన పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో కాన్వాయ్ పై చెప్పుపడటం కలకలం రేపింది. బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బయల్దేరిన పవన్ తల్లాడ వద్ద అభిమానులకు తన కాన్వాయ్ నుంచి అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ కాన్వాయ్పై చెప్పును విసిరాడు. తర్వాత పవన్ తల్లాడ నుంచి ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు.
నేరుగా ఎంబీ గార్డెన్కు వెళ్లిన పవన్ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పార్టీ ముఖ్య సమన్వయ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎంబీ గార్డెన్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. పవన్ సభ ప్రాంగణానికి చేరుకోగానే రెచ్చిపోయిన కార్యకర్తలు ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ రావడంతో మీడియా సిబ్బంది గాయపడ్డారు. వీడియో జర్నలిస్టుల కెమెరాలు విరిగిపోయాయి. సభా ప్రాంగణమైన ఎంబీ గార్డెన్లో కుర్చీలన్ని విరిగిపోయాయి.