Telugu Gateway
Telangana

తెలంగాణ...అద్భుత సాహిత్య మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతం...అద్భుత సాహిత్యం అందించిన మాగాణం అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఎంతో మంది కవులు...సాహితీవేత్తలు ఈ ప్రాంతం నుంచి వచ్చారని తెలిపారు. పదో శతాబ్దంలోనే తొలిసారి జినవల్లబుడి శాసనంలో తెలుగు కందపద్యం ఉందన్నారు. పాల్కురికి సోమన, పోతన, రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ, సినారె, సుద్దాల హనుమంతు, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజువంటి ఎంతో మంది సాహిత్య కారులను అందించి ప్రాంతం తెలంగాణ అని చెప్పారు. ఎంత గొప్పవారైనా అమ్మ ఒడే తొలిబడి.. చనుబాలు తాగించే తల్లి జో అచ్చుతానంద జోజోముకుందా అంటూ ఓ బిడ్డను ఆదర్శ బిడ్డగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా...ప్రపంచాన్ని కూడా బిడ్డకు పరిచయం చేస్తుందని తెలిపారు. బంధువర్గాన్ని తెలిపే తొలి గురువు తల్లి. తల్లి,దండ్రుల తర్వాత గురువుల విద్య ప్రారంభం అవుతుంది. అందులో నీతి ఎక్కువ ఉండేది. తమ స్వగ్రామానికి చెందిన దుబ్బాక గ్రామంలో మృత్యుంజయ శర్మ ఒక పద్యం చెబితే ఐదుసార్లు చదివి అప్పగించాను. రాయి లాంటి నన్ను మా గురువుగారు సాన బెట్టారు. వారి పుణ్యమా అని తొమ్మిదో తరగతిలోనే చెరువుగట్టుపై వృత్తపద్యాలు రాసినట్లు కెసీఆర్ వెల్లడించారు. బమ్మెర పోతన అద్భుత భాగవతం అందించారు. ఎంతోమంది కవులు గొప్పగొప్ప సాహిత్యం అందించారు. నేటి కవుల్లో గోరటి వెంకన్న పాట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. చక్కటి పదాలతో కష్టమైన విషయాలు కూడా అలవోకగా ఆయన చెప్పగలరు.

అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చినట్లుంటుంది. మమ్మీ అంటే పెదవుల నుంచి వచ్చినట్లుంటుందని మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నో సభల్లో చెప్పారు. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవారు. కానీ ఆ అబిప్రాయం తప్పు. ఎలా బతకాలో నేర్పేవాడే గురువు అని వ్యాఖ్యానించారు. సమాజం భవిష్యత్తు పంతుల్ల చేతుల్లోనే ఉంది. తెలుగు భాష బతకాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాష పండితులు నడుంకట్టాలి. ఒక భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేయాలి. ఓ కవి మరో కవిని తయారు చేయాలి. తెలుగు భాషను బతికించుకోవడం కోసం ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయం చేస్తుంది' అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. పండితులకు కొన్ని సమస్యలు ఉన్నాయని తన మిత్రుడు దేశపతి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని...వారం రోజుల్లోనే వాటిని పరిష్కరిస్తానని తెలిపారు.

Next Story
Share it