Telugu Gateway
Cinema

2.ఓ సినిమా విడుదల తేదీ మళ్ళీ మారింది

భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శంకర్ 2.ఓ సినిమా విడుదలలో మరింత జాప్యం కానుంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పటికి విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవటంతో సినిమా విడుదలను వచ్చే ఏడాది ఏప్రిల్ 27కి మార్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 2.ఓలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయకుమార్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. అయితే 2.ఓ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రజనీకాంత్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12న విడుదల అవుతుందా? లేదా అన్నది కూడా సందేహస్పదంగానే మారిందని చెబుతున్నారు.

ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ 2.ఓ సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదల అయింది. అలాగే 2018 ఏప్రిల్27న 2.ఓ విడుదల కానుంది. మరి చరిత్ర పునరావృతం అవుతుందా? అని ప్రశ్నించారు. శంకర్, రజనీ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కావటంతో పాటు...బాలీవుడ్ లో హీరోగా ఉన్న అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తరుణ్ ఆదర్శ్ చెప్పినట్లు బాహుబలి 2 రికార్డులను 2.ఓ బద్దలు కొడుతుందా? లేదా తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే మరి.

Next Story
Share it