Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం నాడు అధికార టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిడ్డి ఈశ్వరితో పాటు నియోజకవర్గానికి చెందిన నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో తన ఆత్మాభిమానం దెబ్బతినటం వల్లే తాను పార్టీమారాల్సి వచ్చిందని..తనకు పార్టీలో తగిన గుర్తింపు కూడా లభించటం లేదని అన్నారు. పాడేరు నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తాను ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నానని..విడిపోయిన రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డంకులు సృష్టించవద్దని అందరినీ కోరినట్లు తెలిపారు. అందుకు చాలా మంది స్పందిస్తున్నారని..తటస్థులు కూడా వస్తున్నారని చెప్పారు.

ఈ మధ్యే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి తనయుడు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరారని అన్నారు. టీడీపీలో చేరిన తర్వాత గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో కోట్లు ఉంటేనే సీట్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. కొత్తగా కార్పొరేట్ వ్యక్తి కుంబారావు బాబును తీసుకొచ్చి పాడేరు సీటు ఇవ్వటానికి రెడీ అయిపోయారని..అందుకే తాను పార్టీ మారాల్సి వచ్చిందని..ఈ విషయం జగనే స్వయంగా తనకు తెలిపారని గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంబారావు బాబును తీసుకోవద్దని..చివరి నిమిషం వరకూ విజయసాయిరెడ్డితో మాట్లాడానని..అయినా వారు అందుకు అంగీకరించలేదన్నారు. అందరి కోరిక మేరకే తాను టీడీపీలో చేరినట్లు గిడ్డి ఈశ్వరి తెలిపారు.

Next Story
Share it