పాదయాత్ర వేళ తెరపైకి విజయమ్మ
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో దివంగత వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ ను ఆదరించినట్లే..తన కొడుకును కూడా ఆదరించాలని ఆమె ప్రజలను కోరారు. వైఎస్ అధికారంలో ఉండగా చేపట్టిన ప్రతి పథకం పాదయాత్ర స్పూర్తి నుంచి వచ్చిందే అన్నారు. జగన్ కూడా ఇఫ్పుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నాడని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ను మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా అక్కున చేర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయమ్మ ఆదివారం పులివెందులలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ ఆశయాలు..సంక్షేమ పథకాల అమలుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లు తెలిపారు. ఈ పార్టీ లేకుండా వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఉండేవి కావని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించడలంలేదన్నారు. వైసీపీ ఉండటం వల్లే వైఎస్ పథకాలు ఎంతో కొంత అమలు అవుతున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపిీకి అదికారం ఇస్తే జగన్ స్వర్ణయుగం తెస్తాడని అన్నారు. చంద్రబాబు ఏ అనుమతి తీసుకుని పాదయాత్ర చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ రాజకీయం చేయటం తగదన్నారు.