Telugu Gateway
Telangana

పారిశ్రామికవేత్తల సదస్సులో నారా బ్రాహ్మణి

హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోడలు..మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఆమె ఈ సదస్సుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలసి వచ్చారు. ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఈ సదస్సుకు ప్రధాని మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా హాజరైన విషయం తెలిసిందే. దాదాపు 150 దేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక రంగానికి ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని..ఇక్కడ జరిగే చర్చల ద్వారా కొత్త ఆలోచనలు పొందవచ్చన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతో మంచి అవకాశం అని పేర్కొన్నారు. సదస్సు ఎక్కడ జరుగుతుందనేది అంశమే కాదని..హైదరాబాద్ ఈ సదస్సుకు వేదిక కావటం ఆనందమే అని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రోత్సహిస్తే మహిళలు ఖచ్చితంగా పారిశ్రామిక రంగంలో సత్తా చాటుతారని అన్నారు. ఈ సదస్సులో నారా బ్రాహ్మణి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఏపీలో ఈ సదస్సు నిర్వహించేందుకు ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడీబీ) ద్వారా విశ్వప్రయత్నం చేశారని వార్తలు వచ్చాయి.

Next Story
Share it