Telugu Gateway
Top Stories

లండ‌న్ లోనూ రుణం ఎగ్గొట్టిన విజ‌య్ మాల్యా!

లండ‌న్ లోనూ రుణం ఎగ్గొట్టిన విజ‌య్ మాల్యా!
X

ఇంటిని స్వాధీనం చేసుకోనున్న యూబీఎస్ బ్యాంక్

భారత్ లో వేల కోట్ల రూపాయ‌ల మేర బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టిన ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త విజ‌య్ మాల్యా లండ‌న్ లోనూ అదే ప‌నిచేశారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ఇంటిని బ్యాంకు స్వాధీనం చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. లండన్ లోని విజ‌య్ మాల్యా ఇంటిని స్వాధీనం చేసుకోవ‌టానికి యూకె కోర్టు స్విస్ బ్యాంక్ యూబీఎస్ కు అనుమ‌తి ఇచ్చింది. ఈ బ్యాంకుకు విజ‌య్ మాల్యా బ‌కాయి ప‌డిన బ‌కాయి భార‌తీయ క‌రెన్సీలో 206 కోట్ల రూపాయ‌లు. అయితే ఈ రుణం చెల్లింపున‌కు ఇంకా స‌మ‌యం పొడిగించ‌టం సాధ్యంకాద‌ని కోర్టుపేర్కొంది. భార‌త్ నుంచి పారిపోయిన త‌ర్వాత విజ‌య్ మాల్యా అక్క‌డ విలాస‌వంత‌మైన జీవనం సాగిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అంతే కాదు..ఆయ‌న అక్క‌డ జ‌రిగే క్రికెట్ మ్యాచ్ ల‌తోపాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ కూడా మీడియాకు క‌న్పించారు.

అయితే త‌న లండ‌న్ ఇంటిని యూబీఎస్ బ్యాంకు వ‌ద్ద త‌న‌ఖా పెట్టి రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ రుణం చెల్లించ‌టంలోనూ డిఫాల్ట్ అయ్యారు. దీంతో ఆయ‌న ఇంటిని స్వాదీనం చేసుకునేందుకు బ్యాంకు సిద్ధం అవుతోంది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై స్టే పొడిగింపున‌కూ, లేదా ఇత‌ర కోర్టులో అప్పీల్ కు కూడా విజ‌య్ మాల్యాకు అనుమ‌తి ద‌క్క‌లేదు. దీంతో యూబీఎస్ బ్యాంకు ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే దిశ‌గా ముందుకు సాగ‌టానికి లైన్ క్లియ‌ర్ అయింది. భార‌తీయ బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా లండ‌న్ లో ఉండి త‌న‌కు బ్యాంకు అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ ఉన్నాయ‌ని..త‌న‌ను బ్యాంకు డిఫాల్ట‌ర్ గా చూడ‌టం స‌రికాదంటూ వాదిస్తూ వ‌చ్చారు. అయితే ఈ వాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. మాల్యాను భార‌త్ కు రప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా ఇప్ప‌టివ‌ర‌కూ విజ‌య‌వంతం కాలేదు.

Next Story
Share it