గత ప్రభుత్వ అక్రమాలు...అవినీతి వెలికితీతపై కాంగ్రెస్ ఫోకస్
దీని వెనక రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పేరు చెప్పి గత ప్రభుత్వం ఏమి చేసింది అనే విషయం బయటకు చెప్పటం ద్వారా బిఆర్ఎస్ అసలు రంగు బయటపెట్టడం ఒకటి...తద్వారా రాజకీయ ప్రయోజనం పొందటం మరొకటి. ఒక పని చేస్తే చాలు...మిగతా విషయాలు అన్ని వాటంతట అవే జరిగిపోతాయి. దీంతో ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయం బిఆర్ఎస్ నేతల్లో ఉంది అని చెపుతున్నారు . రాష్ట్ర స్థాయిలో జరిగిన వ్యవహారాలే కాకుండా...జిల్లాల్లో చోటు చేసుకున్న అంశాలపై కూడా కొత్త ప్రభుత్వం దృష్ఠి సారించింది.ఇందుకు ఉదాహరణ బిఆర్ఎస్ కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి చెందిన మాల్ కు అటు ఆర్టీసీ, ఇటు విద్యుత్ శాఖ అధికారులు నోటీసు లు ఇవ్వటం. గత ప్రభుత్వంలో అప్పటి పెద్దలకు ఎంతో సన్నిహితంగా ఉన్న జీవన్ రెడ్డి అటు లీజ్...ఇటు విద్యుత్ కు సంబంధించి పది కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి బకాయి పడ్డారు. అంటే ఇది ప్రభుత్వ అండదండలు లేకుండా సాగదు అనే విషయం తెలిసిందే. ప్రభుత్వం మారటంతో అధికారులు కూడా కొరడా జులిపించటం మొదలు పెట్టారు. ఇవి అన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలన విషయంలో వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే అంటున్నారు అధికారులు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ వంటి నేతలు కొత్త ప్రభుత్వం ఏమి చేస్తుందో చూస్తాం...వాళ్లకు సహకారం అందిస్తాం అంటూ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరిన్ని కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది అనే చర్చ సాగుతుంది. మరి గత ప్రభుత్వానికి చెందిన ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో..వాటిపై కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.