బీజేపీ నుంచి వలసలు ఆగుతాయా
వరంగల్ పర్యటన సందర్భంగా మాట్లాడిన మోడీ సహజంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్ట్ లు ..ఇతర అంశాల మధ్య సంబంధాలు ఉంటాయని...కానీ అవినీతి చేయటం కోసం రెండు రాష్ట్రాలు కలిశాయని ఢిల్లీ లిక్కర్ స్కాం పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. అంతే కాదు..కెసిఆర్ సర్కారు చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి రాజ్యం ఏలుతుంది అని...దేశంలోనే అత్యంత అవినీతి సర్కారు కెసిఆర్ ది అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం నాశనం చేసింది అని...నిత్యం మోడీని..కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంది అని విమర్శలు గుప్పించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ...ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్లు ప్రధాని మోడీ కూడా కేవలం ఆరోపణలు చేసి వెళితే ఏమి ఉపయోగం ఉంటుంది...సాధికారికంగా ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి అని చెప్పినప్పుడు ఒక దాంట్లో కాకపోతే ఒక అంశం లో అయినా చర్యలు ఉంటాయని ప్రజలు భావిస్తారు కదా?. అలాంటిది ఏమీ లేకుండా కేవలం విమర్శలు చేసి వదిలేస్తే బీజేపీ ని నమ్మటం జరిగే పని కాదు అని చెప్పొచ్చు. అటు మోడీ తో పాటు ఇటు కేంద్ర మంత్రి,, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా సీఎం కెసిఆర్ హామీలు ఇచ్చి మోసం చేసిన అంశాలను ప్రధానంగా వరంగల్ సభలో ప్రస్తావించారు. మరి మోడీ చెప్పిన మాటలతోనే బీజేపీ నుంచి సాగుతున్న వలసలకు బ్రేకులు పడతాయా...బీజేపీ లో తిరిగి పాత జోష్ వస్తుందా అంటే కొద్దికాలం వేచిచూడాల్సిందే.