Telugu Gateway
Telangana

ప్రశ్నలే పనితీరుకు నిదర్శనమా?

ప్రశ్నలే పనితీరుకు నిదర్శనమా?
X

ఎక్కువ ప్రశ్నలు అడగటం గొప్పా...ఎక్కువ పనులు చేయించుకోవటం గొప్పా?. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూసి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కు అవుతున్నారు. తమ ఎంపీలు పార్లమెంట్ లో కాంగ్రెస్, బీజేపీ కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగారు కాబట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అడుగుతున్నారు అయన. పార్లమెంట్ లో తెలంగాణ గొంతు పెద్దగా..స్పష్టంగా వినిపించాలంటే టీం కెసిఆర్ ను గెలిపించాలని కోరుతున్నారు. దీనికి సంబందించిన లెక్కలను కూడా ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ లో ప్రస్తావించారు. ఇదే కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కారు తెలంగాణకు విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయలేదు అని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్రం ఏ మాత్రం సాయం చేయక పోయినా తామే తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ వచ్చిన విషయం అందరూ చూశారు. ఈ లెక్కన ఎన్ని ప్రశ్నలు వేసి ఏమి ఉపయోగం ఉంటుంది అన్న ప్రశ్న ఉదయించటం సహజం. చట్ట సభల్లో ప్రశ్నలు అడగటం అనేది ఆయా పార్టీలు...సభ్యుల బాధ్యత. అంతే కానీ..ఎక్కువ ప్రశ్నలు అడిగి..ఎలాంటి ఫలితం సాధించకపోతే ఉపయోగం ఏమి ఉంటుంది?. పార్లమెంట్ లో గొప్పగా ఎక్కువ ప్రశ్నలు అడిగామని గొప్పగా చెప్పుకుంటున్న కేటీఆర్ తాము అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ లో వ్యవహరించిన తీరు కూడా గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.

ప్రతిపక్షాలు ఏమి ప్రశ్నలు అడిగినా బుల్డోజ్ చేయటంతోపాటు ...తాము ప్రజలకు తప్ప...ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు అంటూ అప్పటి సీఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు అందరూ చూశారు. ఇక్కడ ప్రశ్నలు అడిగితే బుల్డోజ్ చేశారు..అదే పార్టీ మళ్ళీ పార్లమెంట్ విషయానికి వచ్చే సరికి తమ ఎంపీలు ఎక్కువ ప్రశ్నలు అడిగారు అని క్లెయిమ్ చేసుకోవటం...దీన్ని చూసి తమ ఎంపీలను గెలిపించాలని కోరటం విశేషం. ఇదే బిఆర్ఎస్ కేంద్రంలోని మోడీ సర్కారు కు అత్యంత కీలకమైన విషయాల్లో మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. తొలుత పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించిన కెసిఆర్ అసెంబ్లీ లో కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని మోడీ పై విమర్శలు చేయటాన్ని కూడా అంగీకరించలేదు. కేంద్రం తెచ్చిన వివాదాస్పద రైతు చట్టాలకు కూడా మద్దతు ఇచ్చి తర్వాత రివర్స్ గేర్ వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కెసిఆర్ కేంద్రంలోని మోడీ సర్కారు విషయంలో వేసిన పిల్లి మొగ్గలు ఎన్నో. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ ప్రదమైన సీట్లు సాధించే ప్రయత్నాల్లో బిఆర్ఎస్ ఇప్పుడు తంటాలు పడుతోంది. లేకపోతే పార్టీలో నాయకులను నిలుపుకోవటం కష్టం అనే అభిప్రాయం నేతల్లో ఉంది. మరి లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంత మేర సత్తా చాటుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it