వరద బాధిత ప్రాంతాల్లో తమిళ్ సై పర్యటన
ఓ వైపు గవర్నర్ తమిళ్ సై. మరో వైపు సీఎం కెసీఆర్. భద్రాచలం వరద బాధితుల పరామర్శలో ఉన్నారు. ఆదివారం నాడు తమిళ్ సై భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం బట్టీల గుంపులో వరద బాధితులను పరామర్శించారు. పాములపల్లిలో గోదావరి ముంపునకు గురైన ఇళ్లను గవర్నర్ చూశారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ ఆమె వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో షెల్టర్ క్యాంపులు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్యం, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ బృందాలను గవర్నర్ ఆదేశించారు.
పర్యటనలో భాగంగా షెల్టర్ క్యాంపులను గవర్నర్ సందర్శించి.. రెడ్క్రాస్ సొసైటీ, ఇతర సంస్థల నుంచి సహాయ సామగ్రిని సమీకరించనున్నారు. అశ్వాపురంలో వరద బాధితుల క్యాంప్ ను సందర్శించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. ఎప్పటిలాగానే ఈ సారి జిల్లా కలెక్టర్, ఎస్పీలు గవర్నర్ పర్యటన వైపు కన్నెత్తి చూడలేదు. సీఎం కెసీఆర్ టూర్ కూడా ఉండటంతో వారంతా అటు వైపు ఫోకస్ పెట్టారని సమాచారం. అయితే గత అనుభవాలను బట్టి చూస్తే ప్రభుత్వం సహజంగానే గవర్నర్ పర్యటనలకు సహాయ నిరాకరణ చేస్తూ వస్తోంది.