Telugu Gateway
Telangana

గ్రామీణాభివృద్ధిపై అల‌స‌త్వం వీడాలి

గ్రామీణాభివృద్ధిపై అల‌స‌త్వం వీడాలి
X

రాష్ట్రంలోని అధికారులు అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధిమీదనే దృష్టి కేంద్రీకరించాల‌ని ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఆదేశించారు. ఆయ‌న ఆదివారం నాడు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల అభివృద్ధిపై స‌మావేశం నిర్వ‌హించారు. 'సేవ్ ద పీపుల్ సేవ్ ద విలేజెస్ సేవ్ యువర్ సెల్ప్'' నినాదంతో ముందుకు సాగాల‌న్నారు. గ్రామీణాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచింది..కేరళ పర్యటనకు కొంతమంది అదనపు కలెక్టర్లను డీపీవోలను ఎంపిక చేసి పంపించాలని సిఎస్ ను ఆదేశించారు.ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు పరుస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకున్నది. పర్సనల్ అప్రేజల్ రిపోర్టును (పీఏఆర్) తయారు చేయడం ద్వారా కలెక్టర్ల పనితీరును రికార్డు చేస్తాం. నిరంతరం డిపీవోలు డిఎల్పీవోలు ఎంపీడీవో లతో సమావేశాలు నిర్వహించాలి. పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం. తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యక్షంగా పాల్గొంటాన‌ని కెసీఆర్ తెలిపారు.

అదనపు కలెక్టర్లు , జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు ఒక యజ్ఞంలా కృషి చేయాల‌న్నారు. అధికారులు తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదు. జూన్ 20 న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అదేరోజు వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రారంభించ‌నున్నారు. మ‌ల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాకు శంఖుస్థాపన కూడా చేస్తారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను, 24 అంతస్తులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలి. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం... దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీపాడ్ ఏర్పాటు చేయాల‌న్నారు.

Next Story
Share it